Tuesday, 11 August 2020

ఆగస్టు 11 ఎడారిలో సెలయేర్లు

 (సంకలనం: శ్రీమతి చార్లెస్ ఇ. కౌమన్; అనువాదం: జోబ్ సుదర్శన్)

అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపక పోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను (హబక్కూకు 3:17-18). 

ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి. భక్తుడు వెలిబుచ్చిన విశ్వాసం ఎంత శౌర్యవంతంగా ఉందో గమనించండి. నిజంగా చూస్తే అతడేమంటున్నాడంటే “నాకు భోజనం ఎక్కడనుండి వస్తుంది అని నేను తడుములాడు కోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఇల్లంతా గుల్లయినప్పటికీ, నా పొలమంతా బీడు భూమిగా మారినప్పటికీ, ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెన ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను యెహోవాయందు ఆనందించెదను.”

ఈ మాటలు సువర్ణాక్షరాలతో రాయతగ్గవి. దేవుని కృపవల్ల ఈ మాటలన్నీ మన హృదయాలపై చెరగని శిలాక్షరాలు కావాలి. ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే, భక్తుడు తన కష్టసమయంలో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు. ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు. ఇన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఆయన నుండి తనకేదో దక్కబోతున్నదని సంతోషంగా ఎదురుచూస్తుంటాడు. ఇది ఎంత గంభీరమైన నిశ్చయత! ఎంత కీర్తివంతమైన విశ్వాసం! ఎంత అజేయమైన ప్రేమ!

తేలిక మనసుతో బాధలనెదిరించేవాడు

వాటిని తేలిక చేసుకుంటాడు

కన్నీరు కార్చినవాడు

కమ్మని పాట వింటాడు

వానలో పాడే కోయిలమ్మా అర్థమైంది

నీ గీతంలోని మధురిమ అందులోని సందేశ సగరిమ

మబ్బు ముసిరినప్పుడే పాటకు సమయం.